Ad Code

Responsive Advertisement

తిరుప్పావై - శ్రీ వ్రతము

తిరుప్పావై అంటే శ్రీ వ్రతము. శ్రీ అంటే సంపద. అన్ని సంపదలను ఇచ్చే ఈ నోమునే ధనుర్మాస వ్రతం అంటారు. డిసెంబర్ మధ్యలో ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి జనవరి 14న మకరంలోకి వచ్చేవరకు ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్ని మార్గశీర్షం అంటారు. ఈ రెండూ ఒకటే. చాంద్రమానమును బట్టి మార్గశీర్షం అయితే, సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. మార్గము అనగా దారి లేదా ఉపాయం. శీర్షం అంటే శిరసువలె ప్రధానమైంది. అందుకే భగవానుని పొందడానికి శ్రేష్ఠమైన ఉపాయమే ఈ వ్రతం అని ఉపనిషత్ సిద్ధాంతం. భగవానుడే ఉపాయం. ఇతరములేవీ కావు అనే విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది ఈ వ్రతం. ఉపనిషత్తు భాషలో ధనుస్సు అనగా ప్రణవం. అంటే ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దం. ఆ ప్రణవాన్ని ఉపాసించడం ద్వారా పరమాత్మను చేరు మార్గము ధనుర్మాస వ్రతం. 



దేవదేవుడితో భక్తహృదయాల చెలిమి దివ్యమైన వూహలకు హేతువుగా మారుతుంది. ఆ అనుభవాల్ని రామాయణంలో హనుమంతుడు, లక్ష్మణుడు; భారత భాగవతాల్లో అర్జునుడు, సుదాముడు సొంతం చేసుకున్నారు. గోప గోపికలు కృష్ణభగవానుడి సాన్నిహిత్యంలో ఓలలాడారు.అలాంటి శుద్ధ భక్తికి ఆద్యులైనవారి జాబితాలో ఆళ్వార్లు ఉన్నారు.

ఆళ్వార్లు జ్ఞాన నిధులు.  పన్నెండుమంది ఆళ్వార్లలోనూ ఏకైక మహిళామణి ఆండాళ్‌. ఆమెను ‘గోదాదేవి’ అని పిలిచేవారు.ధనుర్మాసం (ధనుస్సంక్రమణం) ప్రారంభం కాగానే, గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రారంభించింది. రోజూ వేకువజామున మార్గశీర్ష స్నానం చేయడం ఆ వ్రతంలోని ముఖ్య ఘట్టం. కీర్తనల్ని గానం చేస్తూ చెలుల్ని నిద్రలేపేది. వాటిని ‘పాశురాలు’ అంటారు. ఉపనిషత్తుల సారంగానూ భావిస్తారు.

గోదాదేవి రోజుకొక్క పాశురాన్ని గానం చేసేది. దైవాన్ని వర్ణించేది.‘అవ్యక్తోపనిషత్తు’లోని దేవ రహస్యాలన్నీ ఆ పాశురాల్లో వ్యక్తమయ్యేవి. పదకొండు నుంచి ఇరవై ఆరో పాశురం వరకు ఆమె గానం చేసిన ప్రబంధ సారమంతా ఈశావాస్యోపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తుల భావమేనని ప్రతీతి. ముప్ఫయ్యో పాశురం ఫలశ్రుతి. ఆ పాశురాలన్నీ భగవంతుణ్ని చేరడానికి అనువైన మార్గాలని భక్తులు భావిస్తారు. ధనుర్మాసంలోని పలు ఆలయాల్లో గోదాదేవి విరచిత పాశురాలే వీనులకు విందు చేస్తూ వినపడుతుంటాయి.

Post a Comment

0 Comments