Ad Code

Responsive Advertisement

పంచ అయ్యప్పస్వామి క్షేత్రాలు

అయ్యప్ప స్వామి ప్రధాన క్షేత్రం శబరిమల అయిన. స్వామి పాదధూళితో పునీతమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఈ క్షేత్రాలను దర్శించడమే కాదు స్మరించడం కూడా పుణ్యప్రదం.


శ్రీకుళత్తుపుళా (బాలుడి రూపంలో దర్శనం)


పూర్వం ఒక పండితుడు క్షేత్ర పర్యటన చేస్తూ  ఈ  కుళత్తుపుళా నదీతీరంలో బసచేసాడు. ఆ సమయంలో శిష్యులు ఆహారం వండడం కోసం రాళ్లను కొట్టడంతో, ఒక పెద్ద రాయి నుండి రక్తం కారింది. అప్పుడు పండితుడు రామేశ్వరం నుండి తెచ్చిన పవిత్ర జలం చల్లడంతో బాలుడి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిచ్చాడు. స్థానిక పాలకులు  కేరళ సంప్రదాయంలో అక్కడ  స్వామివారికి ఆలయం నిర్మించారు. 


ఈ ఆలయంలో అయ్యప్పస్వామి బాలుడిగా నిల్చుని దర్శనమిస్తాడు. ద్విభుజాలతో ఒక చేతిలో విల్లును, మరొకవేతిలో బాణం ధరించి దివ్యమనోహరంగా దర్శనమిస్తాడు. స్వామివారు పులిపాలు తేవడం కోసం వెళ్లినప్పుడు ఇక్కడ కొంత సమయం గడిపినట్లు కధనం. 


తిరువనంతపురం 60 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ ఆలయం. 


అరియాంగావు (యువకుడుగా స్వామి దర్శనం)


ఒక వస్త్రవ్యాపారి తన కూతురుతో కలసి ట్రావెన్ కోర్ సంస్థానానికి వచ్చాడు. వాళ్ళు అరియాంగావు ఆలయంలో విశ్రమించారు. తండ్రి వ్యాపారానికి వెళ్ళాడు, కూతురు పుష్పకళ ఆలయంలో వుంది. మార్గమధ్యంలో వ్యాపారి పైన ఏనుగులు దాడి చేయడంతో ఒక యువకుడు కాపాడాడు. వ్యాపారి కుర్రవాడిని పట్టువస్త్రాలతో సన్మానించి ఏంకావాలో కోరుకున్నాడు. యువకుడు నీ  కూతురితో వివాహం జరిపించు అని అడిగి మాయమయ్యాడు. అప్పుడు వ్యాపారి వచ్చింది అయ్యప్పస్వామి అని గ్రహించాడు. కుమార్తెనిచ్చి స్వామికి వివాహం జరిపించాడు.


ఈ ఆలయంలో స్వామి ఎడమకాలు మడిచి పైన పెట్టుకుని, కుడికాలును  క్రిందకు వదిలిన భంగిమలో నిల్చుని దర్శనమిస్తాడు. ఒక చేతిలో పుష్పాన్ని ఉంచి మరోచేతిని మోకాలి పై నుంచి కొలువుదీరాడు. స్వామివారి చెంతనే పుష్కలాంబ దేవి నిలుమని వున్నారు. కుడివైపు శివలింగం వుంది.


తిరువనంతపురం 86 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ ఆలయం. 


అచ్చన్ కోవిల్ (గృహస్థగా స్వామి దర్శనం)


ఒకసారి రాత్రి వేళలో పరశురాముని ఏదో పురుగు కుట్టింది. ఆ బాధతో నిద్రపట్టలేదు. ఆ సమయంలో ఒక యువకుడు అమృత పాత్ర ఆయనకు అందించి బాధ పోగొట్టాడు. ఆ మరునాడే పరశురాముడు అయ్యప్ప స్వామి ఇక్కడ ప్రతిష్టించి, పూజలు నిర్వహించాడు. ఆలయం తమిళ నిర్మాణ పద్ధతిలో  నిర్మితమైంది.శబరిమల లాగా 18 మెట్లు ఉన్నాయి.


శబరిమలలో వున్నట్లే ఇక్కడ  ఆసీనులై వున్నారు. అయితే ఒక చేయి మోకాలి మీద ఉంచి క్రిందకువదలగా  మరొక చేతిలో  అమృత పాత్రను ధరించి వున్నారు. స్వామివారి ఇరువైపులా దేవేరులైన పూర్ణ, పుష్కలా దేవి కొలువుదీరి వున్నారు.  ఇక్కడి స్వామివారికి అభిషేకం చేసిన చందనం, పసుపు వంటివి కలిపిన జలం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు. ఇది విషకీటకాల కాటు నుంచి కాపాడుతుందంటారు. ఏ సమయం లోనైనా సరే విషపురుగులు కాటువేసిన వారు ఆలయాన్ని వస్తే అర్చకులు ఆలయం తెరిచి, అభిషేక జలాన్ని ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.


తిరువనంతపురం 90 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ ఆలయం. 


శబరిమల 


పందల రాజు రాజశేఖర్ పాండ్యుని వద్ద అయ్యప్ప స్వామి పన్నెండేళ్లు పెరిగాడు. తనకు రాజ్యం వద్దనీ, తాను వదిలిన బాణం ఎక్కడ పడితే అక్కడ ఆలయం కట్టించమని చెప్పాడు.


ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లు కధనం.ఇక్కడ స్వామివారు తప్పొముద్రలో ఆసీనులై వుంటారు.


ఈ ఆలయంలో సంవత్సరమంతా దర్శనం ఉండదు. ఈ ఆలయానికి తత్వమసి అని పేరు. దీక్ష తీసుకుని ఇరుముడిని తలపైన ధరించిన వారు మాత్రమే పదునెట్టాంబడి అనే 18 మెట్లు ఎక్కడానికి అర్హులు.


కాంతిమల 


శబరిమల క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా మకరజ్యోతి దర్శనం ఇచ్చే కొండకు కాంతిమల అని పేరు.


పూర్వం మహిషిని అంతం చేసి తమను కాపాడినందుకు కృతజ్ఞతగా దేవేంద్రుడు శ్రీ అయ్యప్ప స్వామికి  విశ్వకర్మ చేత కాంతి మల కొండపైన స్వప్న ఆలయాన్ని నిర్మింపజేశాడు.ఈ ఆలయంలో దేవతలు స్వామివారికి నిత్యపూజలు చేస్తారు. సంధ్య హారతి ఇస్తూవున్న సమయంలో ఆ హారతి జ్యోతిలాగ దర్శనం ఇస్తుందంటారు. మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు తో సమానం. దేవతలు ప్రతిరోజూ ఇచ్చే సంధ్య హారతి మనకు సంవత్సరానికి ఒకరోజు మకరజ్యోతిలాగా దర్శనమిస్తూ ఉన్నట్లు చెబుతారు.


ఇక్కడ స్వామివారు ఏకాంతంగా కొలువుదీరడం వల్ల మానవులకు  ప్రవేశం లేదు. 

Post a Comment

0 Comments