నదులకు పుష్కరాలనేవి అనాది వస్తున్న సాంప్రదాయం. గురుడు ఒక్కోరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలనేవి వస్తుంటాయి. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు జరుపుతారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదులలో కొలువై ఉంటారని ప్రతీతి.
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ సమయంలో నిర్వచించిన పితృ కార్యాలు, నది స్నానం, దానం వంటివి రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అని చెబుతారు.
కర్నాటక ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినవే తుంగ, భద్ర. ఇది కర్నాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ కర్నూలు జిల్లాలో గల కౌతాళం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువైన దేవాదిదేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
- తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలంపూర్ లోనూ ఈ పుష్కరాలు జరుగుతాయి.
- కర్నూలులో జిల్లాలోని మంత్రాలయం, సంగమేశ్వరం, కౌతాలం, గురజాల, పుల్లికల్, రాజోలి, నాగల దిన్నెలలో ఇవి జరుగుతాయి.
- ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర ఆలయంతో పాటు శివమొగ్గ జిల్లా, బళ్లారి, చిక్ మంగళూరు జిల్లాలలోనూ ఈ నది వెంబడి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేస్తారు.
పురాణాల ప్రకారం తుంగభద్ర ఆవిర్భావ కథ వరాహావతార కాలంలో కనిపిస్తుంది. హిరణ్యాక్షుని సంహరించిన తరువాత శ్రీమహావిష్ణువు బాగా అలిసిపోయాడు. కర్ణాటకలోని వరాహపర్వతంపై ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పర్వతంపై ఆయన కూర్చోగానే ఒంటినుంచి స్వేదం విపరీతంగా వచ్చింది. ఎడమవైపు నుంచి స్రవించిన శ్రీమహావిష్ణువు స్వేదమే తుంగానదిగానూ, కుడివైపు స్రవించిన స్వేదమే భద్రానదిగా మారాయి. అక్కడి నుంచి తుంగానది 147 కిలోమీటర్లు, భద్రానది 171 కిలోమీటర్లు ప్రవహించి కూడ్లివద్ద సంగమిస్తున్నాయి
పుష్కర స్నానం
రెండు చేతుల బొటనవేళ్లతోనూ రెండు ముక్కురంధ్రాలనూ మూసివుంచుకుని మధ్యవేళ్లతో చెవిరంద్రాలను మూసి నదిలో మునకలు వేయడమే స్నానం. ఏ దివ్యతీర్ధంలో అయినా మునిగేటప్పుడు మూడు మునకలు వేస్తారు.
- మొదటిది నదీ వందనం కోసం,
- రెండో మునక శరీర శుద్ధి, పాపం తొలగించుకోవడం కోసం
- మూడోమునక దేవతలు, పితృదేవతా ప్రీతికోసం.
ఏ వేళలో అయినా నటిని ఉద్దేశ్యపూర్వకంగా చేతితో కొట్టడం కానీ, కాలితో తన్నడం కానీ చేయకూడదు.
అలాగే పుణ్యస్నానాలవేళ సబ్బులు, షాంపూలు, నూనెలు నిషేధం.
మునకలు వేయకుండా స్నానం పూర్తికాదు.
స్నానం తరువాత ఉతికిన వస్తాలు ధరించాలి.
పుష్కర స్నానం అధిక పుణ్యదాయిని.
పుష్కర సమయంలో చేసిన దానం. కర్మకార్యం కోటింట్లు అధిక ఫలాలను కలిగిస్తాయని విష్ణుపురాణం చెబుతుంది. దానాలు చేయడానికి, పిత్మకార్యాలకు సంబంధం లేదు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా పుష్కర సమయంలో దానాలు చేయవచ్చు.
పుష్కర దానాలు :
మొదటి రోజు - బంగారం, వెండి, ధాన్యం, భూమి
రెండోరోజు - వస్త్రాలు, ఉప్పులు, రత్నాలు
మూడోరోజు - బెల్లం, అశ్వం, ఫలాలు
నాలుగో రోజూ - నెయ్యి,తైలం, పాలు, తేనె
ఐదో రోజు - ధాన్యం,రధం ఎద్దుల జత, నాగలి
ఆరో రోజు - కర్పూరం, చందనం, కస్తూరి,ఔషదాలు
ఏడో రోజు - ఇల్లు, పీఠ,మంచం
ఎనిమిదో రోజు - చందనం,కందమూలాలు, పుష్పమాల
తొమ్మిదవ రోజు - పిండదానం, కన్యాదానం, కంబళి
పదో రోజు - కూరగాయలు, సాలగ్రామం, పుస్తకం
పదకొండో రోజు - ఏనుగు
పన్నెండో రోజు - నువ్వులు
0 Comments