Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - మల్లూరు

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. 



పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.


ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు ఉన్నారు.క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, షిఖాంజనేయ స్వాములున్నారు.


ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశారు.శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు.


ఇక్కడ స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.


ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. ఈ జలపాతంలో భక్తులు భక్తిస్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కల్గినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.


చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మిదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి.


ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.


హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం (అక్కథార - చెల్లెధార) ను సర్వరోగనివారిణిగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.


ఆలయ వేళలు 

ఉదయం 6.00 నుండి రాత్రి 7.00 వరకు 


ఎలా వెళ్ళాలి 


మణుగూరు నుండి 50 కి.మీ దూరం

భద్రాచలం నుండి 80  కి.మీ దూరం


చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :


మేడారం సమ్మక్క సారక్క ఆలయం - 53  కి.మీ

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి ఆలయం - 83  కి.మీ

Post a Comment

0 Comments