తెలంగాణాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం.
ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి
కొలువైయున్నారు .
కాకతీయుల శిల్పకళాచాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాలవరకూ ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే.
కాకతీయుల పరిపాలనలో అయ్యన్నదేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి.
సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకూ మూడు నెలలపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే పెద్దపట్నం, శివకల్యాణం, అయిదు రోజులపాటు సాగే అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలూ, చివరి రోజు రథోత్సవాలనూ ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు.
సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఐనవోలు జాతరలో పెద్దబండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్దబండిని చూడటానికి వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
వరంగల్ నగరానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం.
0 Comments