ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది అయిన కేదారనాథ జ్యోతిర్లింగం హిమాలయ పర్వత ప్రాంతంలోని కేదారనాథ్ క్షేత్రంలో నెలకొని ఉంది.
జ్యోతిర్లింగాలలోని అతి పెద్ద శివలింగం ఇదే. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. ఈ క్షేత్రంలో పర్వత శిఖరమే లింగం కనుక ఇక్కడి స్వామికి పానవట్టం లేదు.
ఈ ప్రాంతం మంచు ప్రదేశం అయినందువల్ల ఆలయం సంవత్సరంలో ఆరు మాసాలపాటు మూయబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు (సాధారణంగా మే నుండి అక్టోబర్ వరకు ) మాత్రమే భక్తులు ఆలయాన్ని దర్శించవచ్చు.
స్కాంద పురాణంలోని కేదారఖండంలో ఈ జ్యోతిర్లింగ మహత్యం చెప్పబడింది. కాగా ఏ భక్తుడైనా కేదారనాధుని దర్శించకుండా,బదరియాత్ర చేసినట్లయితే ఈ యాత్ర నిష్ఫలం అని స్కాందపురాణం చెబుతోంది.
కృతయుగంలో శ్రీమహావిష్ణువు అవతార స్వరూపులైన నర నారాయణలు బదరికావనంలో జగత్కల్యాణం కోసం ఎన్నో వేల సంవత్సరాలు పరమశివుని గురించి తపమాచరించారు. ఏ తప్పసుకు సంతుష్టుడైన పరమశివుడు వారికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు వారిరువురు కేదారాశిఖరంపై కొలువుతీరి భక్తులను అనుగ్రహం ఇవ్వమని పరమశివుని కోరారు. పరమేశ్వరుడు వారి కోరికను మన్నించి అక్కడ జ్యోతిర్లింగంగా వెలశాడు.
గుడి అంతరాలయంలో పంచ పాండవులు, కుంతి, కృష్ణుడు మొదలగు దేవత విగ్రహాలు వున్నాయి. కేదారనాథ్ సమీపంలో ఆదిశంకరుల వారి స్తూపం దర్శించదగినది.
ముఖ్యమైన పండుగలు :
బద్రి -కేదార్ ఉత్సవం (జూన్ నెలలో )
శ్రావణి అన్నకూట్ మేళ (రాఖి పౌర్ణమి రోజు)
శంకరాచార్య సమాధి పూజ
ఆలయ వేళలు :
ఉదయం 4.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు
సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 వరకు
గౌరీ కుండ్ వద్ద వసతి సౌకర్యాలు వున్నాయి. గౌరీ గుండ నుండి 14 కి.మీ నడిచి కేదారనాథ్ ఆలయం దర్శించవచ్చు.
ఎలా చేరుకోవాలి :
రిషికేష్ నుండి 216 కి.మీ
డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ నుండి 240 కి.మీ
0 Comments