తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.
ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు 8వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 6వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 7వ తేదీన అంకురార్పణం సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. సెప్టెంబరు 8వ తేదీ పవిత్రోత్సవాల్లో మొదటిరోజు తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 9న రెండో రోజు అభిషేకానంతర దర్శనం, బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 10న పవిత్రోత్సవాల్లో చివరిరోజు ఉదయం సామవేద పుష్పాంజలి, బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్సేవను టిటిడి రద్దు చేసింది.
సెప్టెంబరు 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 6వ తేదీన మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు.
అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
0 Comments