ఈ కాలంలో హైందవులలో మరే పూజకూ లేనంత విశేష ఆదరణ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి లభిస్తున్నది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కలియుగంలో సత్యదేవుని వైభవం చెప్పనలవి కానంతగా ఉన్నది.
ముఖ్యంగా ప్రతీ సంవత్సరం కార్తీకమాసం వంటి పుణ్యనెలలైతే దీనికి పెట్టింది పేరు. నిజానికి పెండ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి పెద్ద శుభకార్యం ఏది జరిగినా సత్యదేవుని ఆరాధన తప్పనిసరి.
ఈ వ్రతం చేసుకోవడానికి ప్రత్యేకించి తిథి, వారం వర్జ్యం అంటూ ఏవీ అక్కర్లేదు.
ఏడాది పొడుగునా ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ వారం నాడైనా చేసుకోవచ్చు. దీని వైభవానికి ఇదీ ఒక కారణం.
భక్తులకు ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, ఆనందాన్ని, సుఖసంసారాన్ని, కీర్తిప్రతిష్ఠలను ఇలా అన్ని రకాల కోర్కెలను తీర్చగల అద్భుతదేవుడిగా సత్యనారాయణస్వామి ప్రగాఢ విశ్వాసాన్ని చూరగొన్నారు.
ఈ సందర్భంగా పౌరోహితుడు ఆసక్తికరమైన అయిదు పౌరాణిక కథలను శ్రావ్యంగా వినిపిస్తాడు.
స్కాందపురాణంలోని రేవాఖండంలో ఈ వ్రతకథ గురించిన వివరాలు ఉన్నాయి. తెలుగువారికి అత్యంత ఆరాధ్యనీయుడైన ‘సత్యదేవుని ఆలయం’గా అన్నవరం ఎంతో ప్రసిద్ధినొందింది.
ఇది తూర్పుగోదావరి జిల్లాలో పంపానది ఒడ్డున వెలసింది.
ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా తమ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి స్వామి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించుకోవాలని కలలు కంటారు.
0 Comments