Ad Code

Responsive Advertisement

నిజమైన భక్తి



కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా.. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా.. దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే.. అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం.. పళ్లాన్ని ముట్టుకోవడం.. అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు! విషయం కాశీ రాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు. అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’ అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి.. ‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’ అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.


-  ఇంటర్నెట్ నుంచి సేకరించింది.

Post a Comment

0 Comments