శివునికోసం చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఉడుపి. కాలక్రమంలో ఉడిపి అయింది.
పేరుకు తగ్గట్టు ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛముగా వెన్నెలలో ప్రకాశించే చంద్రుడులా ఉంటుంది.
శ్రీ మద్వాచార్యులు రాకతో ఈ క్షేత్ర వైభవం పతాకస్థాయికి చేరింది.
ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రం అని అంటారు.
తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచన బ్రహ్మ అని వ్యవహరిస్తారు.
పండరీపుర పాండురంగ స్వామిని నాదబ్రహ్మగా పిలుస్తారు.
ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రంలో శతాబ్దాలుగా ఉచిత అన్నదానం భక్తులకు లభిస్తుంది.
ఈ భోజనశాలలో ఒక్కో బంతికి ఐదు వందల మంది వరకు భోజనం చేయవచ్చు.
అలాగే ఆలయం బయట ఉన్న మరో అన్నక్షేత్ర భవనంలో మూడు అంతస్తులలో ఒక్కో భోజనశాలలో ఒక్కో బంతికి 1400 మంది వరకు ఒక్కేసారి అన్నప్రసాదాన్ని స్వీకరించే సదుపాయం ఉంది.
1915 సంవత్సరంలో అప్పటి పీఠాధిపతి ఈ ఉచిత అన్నదానాన్ని విస్తృతంగా అమలు చేసారు.
ప్రతి రోజు సగటున 30 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.
మకర సంక్రాంతి, మద్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ అష్టమి, నవరాత్రులు, మధ్వ జయంతి, విజయదశమి, నరక చతుర్దశి, దీపావళి, గీత జయంతి వంటి పండుగలను ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుపుతారు.ఈ సందర్భంగా ఉడిపికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 .30 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు భక్తులకు అన్నబ్రహ్మ భోజనశాలలో ఉచిత భోజనం లభిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించి తరువాత భక్తులకు వడ్డిస్తారు.
ఈ అన్నప్రసాదంలో అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగ , ఒక తీపి పదార్ధం వడ్డిస్తారు.
అందరికి అరటి ఆకులలో భోజనం వడ్డించడం ఇక్కడ ప్రతేక్యత.
0 Comments