Ad Code

Responsive Advertisement

మరణసూచక అరిష్టాలు (వాయు పురాణం) || Death Signs from Vayu Puranam

 కొన్నిరకాల అరిష్టాలు అవి కనిపించిన వారికి త్వరలో మరణం రాబోతోందని తెలియచేస్తాయి. ఎలాంటి అరిష్టాలు కనబడితే మానవులకి ఎన్నిరోజుల్లో నెలల్లో, మృత్యువు సంభవిస్తుందో ఇక్కడ చెప్పటం జరుగుతోంది.


ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్ని గానీ, ధ్రువనక్షత్రాన్నిగానీ, చంద్రుడి వెలుగునికాని, రాజమార్గాన్ని కానీ చూడలేనివాడు ఒక సంవత్సరం దాటి జీవించడు.


సూర్యుడు కిరణాలు లేకుండా, అగ్నిని కిరణాలతో ఉన్నట్టుగా చూసేవాడు  పదకొండు నెలలు దాటి జీవించాడు.


ప్రత్యక్షంగా కానీ, కలలోగానీ, మూత్రాన్ని, పిడకని, వెండిని, బంగారాన్ని వాంతి చేసుకున్నవాడు పదిమాసాలు మాత్రమే జీవిస్తాడు.


దుమ్ములోగానీ, బురదలోకానీ ముందువెనుక భాగాలలోగానీ తనువేసిన అడుగు తెగిపోయినట్టుగా కనిపిస్తే అలాంటివాడు ఏడు నెలలు మాత్రమే జీవిస్తాడు


కాకి లేక పావురంగానీ, గ్రద్దగానీ లేక మాంసం తినే మరే ఇతర పక్షికానీ తన తలలో లీనమైనట్టు చూసేవాడు ఆరుమాసాలు దాటి బ్రతకడు.


కాకులు వరసతో కట్టేయబడ్డవాడుగానీ, దుమ్మువానతో చుట్టబడ్డవాడు గానీ, తన నీడని చాలా వికారంగా దర్శించిన వాడుగానీ కేవలం నాలుగైదు నెలలు మాత్రమే జీవిస్తాడు.


దక్షిణ దిశలో మేఘాలు లేకుండా తెలుపుని గానీ, నీళ్ళలో ఇంద్రధనస్సుని గానీ, తన తల లేకుండా వున్న దృశ్యాన్ని చూసినవాడు గానీ ఒక్క నెల దాటి జీవించడు.


నీళ్ళలో గానీ, అద్దంలో గానీ, తనని తాను చూడలేనివాడు, ఒకవేళ చూడగలిగినా తన తల లేకుండా కేవలం ఒక్క మొండమే గనుక కనిపిస్తే ఒక్క నెలలోపే మరణిస్తాడు.


తన శరీరం నుంచి శవం వాసనకాని, వసాగంధం వాసనగానీ వస్తున్నట్లైతే అతడు మరణానికి చాలా చేరువలో ఉన్నాడని తెలుసుకోవాలి అలాంటివాడు 15 రోజులు కూడా జీవించడు.


ఒక్కసారిగా లోపల నుంచి బైటికి వచ్చిన వాయువు తన మర్మస్థానాల్ని కత్తిరించగా ఆ బాధ నివారణ కోసం నీళ్ళు చల్లినప్పటికీ ఏ మాత్రం స్పందించనివాడు ముత్యుముఖంలో ఉన్నాడని గ్రహించాలి.


ఎలుగుదొడ్లతో కోతులు లాగబడుతున్న రథంలో గానంచేస్తూ తాను దక్షిణ దిక్కుకి వెళుతున్నట్టుగా ఎవడైతే తన కలలో చూస్తాడో మృత్యువు చాలా సమీపంలో ఉందని తెలుసుకోవాలి.


స్వప్నంలో నల్లని వస్త్రాలు ధరించిన నల్లని స్త్రీ గానం చేస్తూ దక్షిణ దిక్కుకి వెళ్తున్న దృశ్యం కనిపించినవాడు అల్పాయుష్కుడు


రంధ్రాలు ఉన్న నల్లని వస్త్రాలు ధరించినవాడిని, చెవి విరిగి పోయినట్టుగా ఉన్నవాడిని కలలో చూస్తే చూసినవాడికి మరణం అతి సమీపంలో ఉంటుంది.


స్వప్నంలో తాను బురద సముద్రంలో నిండా మునిగినట్టు కనిపిస్తే వెంటనే మరణిస్తాడు.


బూడిదని, నిప్పుకణికల్ని, వెంట్రుకలు, ఎండుగడ్డిని, పాములు కలలో చూసిన వాడు పదిరాత్రులు కూడా జీవించడు.


సూర్యోదయం కాగానే ప్రత్యక్షంగా నక్క కూతపెడుతూ ఎదురు వస్తే త్వరగా మరణిస్తాడు


స్నానం చేసినంత మాత్రాన గుండె బాగా పిండినట్టుండి పళ్ళు ఇకిలించినవాడు మరణించినట్టే.


రాత్రి పగలు ఎగశ్వాస తీసుకునేవాడు, దీప గంధాన్ని వాసన చూడలేని వాడు మరణానికి దగ్గర్లో వున్నవాడు.


రాత్రిపూట ఇంద్రధనస్సు, పగలు నక్షత్రమండలాన్ని ఇతరుల కళ్ళలో తనని చూసినవాడు ఎక్కువకాలం బ్రతకడు.


ఒక కంటి నుంచి నీరుకారినా, చెవులు తమ స్థానంనుంచి జారినా, ముక్కువంకరగా అయిపోయినా అలాంటివాడు చచ్చినట్టే.


వెంట్రుకలు విరబోసుకుని, పెద్దగా నవ్వుతూ, గానంచేస్తూ, నాట్యం చేస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నట్టు స్వప్నంలో చూసిన వాడు జీవితాన్ని చాలిస్తాడు.


స్వప్నంలో తాను ఎక్కిన రథాన్ని ఒంటెలు గానీ గాడిదలు గానీ కట్టబడి దక్షిణదిశకు లాక్కువెళ్తున్నట్టు కనిపిస్తే ఎక్కువ కాలం బ్రతకడు.


స్వప్నంలో తాను కప్పుకున్న తెల్లటి వస్త్రాన్ని, ఎర్రదానిగా, నల్లదానిగా చూసేవాడికి మరణం సమీపిస్తుంది.


ఈ విధంగా అరిష్టాలు గనుక కలలో కనబడితే ఆ మానవుడు భయపడకుండా, దుఃఖించకుండా వెంటనే నిద్ర లేవాలి. లేచిన తరువాత తూర్పులేక ఉత్తరదిశకి బయలుదేరి ఒక మంచి ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఉత్తరం లేక తూర్పుముఖంగా ఉండి ఆచమనాన్ని చేయాలి. తరువాత భక్తిపూర్వకంగా మహేశ్వరుడికి నమస్కరించాలి. స్థిరంగా కూర్చుని ఆ పరమేశ్వరుని ధ్యానించాలి.

Post a Comment

0 Comments